Pages

Tuesday, June 9, 2009

రాజావారి కోట !

నరసరావు పేట రాజాగారి కోటకు పెద్ద చరిత్రే ఉంది. ఇప్పుడు లేవు కానీ 2, 3 దశాబ్దాల క్రితం కోట శిధిలాలన్నీ చరిత్రకు మౌన సాక్షులుగా నిలబడి ఉండేవి. నరసరావు పేట కు ముందు ఉన్న పేరు అట్లూరు. ఆ తర్వాత ఈ వూరి జమీందారు కోట నిర్మాణం తర్వాత రావు బహద్దూరు వెంకట గుండా రాయణం గారు తమ తండ్రి గారి పేరిట "నరసింహా రావు పేట" అని నామకరణం చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా అది "నరసరావుపేట" గా మారింది.

కోట ఉన్న ప్రాంతాన్ని ఈ రోజుకీ "రాజాగారికోట" అనే పిలుస్తారు గానీ ఆ ప్రాంతానికి ఒక పేరంటూ లేదు. జమీందారు వారసులు ఈ ప్రాంతాన్ని విడిచి చెన్నై వెళ్ళిపోయాక కోట కాల ప్రభావానికి లోనై కూలిపోయింది. కూలిపోయిన భాగం పోగా మిగిలిన శిధిలాలను కూడా కూలగొట్టి అక్కడ అనేక ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగింది.డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆసుపత్రి కూడా ఇక్కడే ఉన్నది. మొదటగా నిర్మించిన ఆసుపత్రుల్లో ఇదొకటి. అలాగే ఊరిలోని వస్త్ర వ్యాపారులందరినీ ఒకే చోట చేర్చే ఉద్దేశంతో కోట ఆగ్నేయ భాగంలో 114 షాపులతో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ప్రారంభమై, తర్వాత మరింత విస్తరించింది. .ఇదొక పెద్ద వస్త్ర దుకాణాల సముదాయం!

(ఈ వ్యాసం కేవలం కోట నిర్మాణ విశేషాలను వివరించడానికే ఉద్దేశించింది కాబట్టి రాజా వారి వంశ చరిత్రను ఇక్కడ ప్రస్తావించడం లేదు.)  

ఏ ప్రాంతంలోనైనా కోటలు వందల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఎలా నిలిచి ఉంటాయో అని ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. ఈ కోట నిర్మాణ క్రమాన్ని పరిశీలించినపుడు తగిన కారణాలు కనిపిస్తాయి.
                                           రాజావారి కోట నమూనా చిత్రం

క్రీ.శ.1797 (పింగళి నామ సంవత్సర శ్రావణ  శుద్ధ పంచమి, శుక్రవారం)కోటకు శంకుస్థాపన జరిగింది.చతురస్రాకారంలో 11 ఎకరాల 13 సెంట్ల విస్తీర్ణంలో దుర్గం నిర్మాణాన్ని ప్రారంభించారు.15 అడుగుల వెడల్పున లోతైన పునాదులు తీయించి,గండ శిలలతో,పాటి మట్టితో పునాదులు నిర్మించారు.తడిపిన పాటిమట్టికి పుట్లకొలది నానవేసిన చింతగింజల్ని కలిపి ఏనుగులతో తొక్కించి పునాదుల నుంచి ప్రహరీ గోడల వరకూ నిర్మించారు.ఈ నాలుల్గు కోట గోడలు కింది భాగాన 15 అడుగుల వెడల్పు కల్గి పై భాగానికి వచ్చేసరికి 3 అడుగుల వెడల్పు ఉండే విధంగా 20 అడుగుల ఎత్తుతో నిర్మితమయ్యాయి.ఇప్పటికీ ఆ ప్రాంతంలో నిలచి ఉన్న ఒకటో రెండో గోడల్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.




కోటకు తూరుపు దిశగా 24 అడుగుల ఎత్తు,16 అడుగుల వెడల్పు గల సింహద్వారాన్ని నిర్మించారు.కోట నిర్మాణం పూర్తి కాగానే పరిసర గ్రామాల్లోని అనేక చేతివృత్తులవారు కోట సమీపంలో స్థిరపడ్డారు.జమీదారు మల్రాజు వెంకట గుండా రాయణిం గారు వారందరికీ ఉచితంగా నివాస స్థలాలు సమకూర్చారు.కోట గోడలపై మొత్తం 5 బురుజులుండేవి.  సాయుధులైన సైనికులు నిరంతరం కాపలా కాస్తుండేవారు. కోట ఉత్తర ప్రహరీ వెలుపల ఏనుగులను నిలిపి ఉంచేవారు. ఆ ప్రాంతానికి ఇప్పటికీ ఏనుగుల బజారు అనే పేరు. అప్పట్లో కాలగతిలో కొన్ని ఏనుగులు మరణించినా, కొత్తగా జీవం పోసుకునే గున్నలతో కలిపి ఎప్పుడూ సంస్థానంలో 99 ఏనుగులే ఉండేవట చిత్రంగా!


పెద్ద చెరువు:
రాజావారి సంస్థానంలోని ఏనుగులు ఈదులాడేందుకు 105 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువునొకదాన్ని రాజా గుండారావు నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమేణా నరసరావు పేటలో నీటి ఎద్దడి ఏర్పడినపుడు అప్పటి పురపాలక సంఘ ఛైర్మన్ శ్రీ రాజా మల్రాజు వెంకట నరసింహా రావు ఆ చెరువును పురపాలక సంఘానికి దానం చేశారు. ఆ తర్వాత  కొన్నాళ్ళకు నీరు లేక చెరువు ఎండిపోవడం వల్ల దీనిలో కళాశాలలు, కాలనీలు,కర్మాగారాలు, గుళ్ళు,  స్కూళ్ళు,హాస్టళ్ళు  వగైరాలు నిర్మించారు. దీనితో ఒక వూరే వెలసినట్లయింది. సత్యనారాయణ టాకీస్(ఇప్పుడు లేదు. దీన్ని కూలగొట్టి ఇక్కడ పువ్వాడ హాస్పిటల్ నిర్మించారు)నుంచి రావిపాడురోడ్డులో ఉన్న రెడ్డి నగర్ వరకు ఈ చెరువు   విస్తరించి నిండుగా నీళ్ళతో (వర్షాలు కురిసినపుడు నీరు పల్నాడు రోడ్డు (NH-9) మీదకు వస్తుండేదట) తొణికిసలాడుతుండేదని ఆ తరం వారు ఇప్పటికీ చెప్తుంటారు.

అద్దాలమేడ:
కోటకు సంబంధించిన మరో విశేషం అద్దాల మేడ. కోటకు వాయవ్య దిశగా 260X190 చదరపు అడుగుల విస్తీర్ణం గల అయిదంతస్థుల రాజ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం గోడల్ని ఇటుకలతో నిర్మించి రాతి సున్నం వెల్ల వేసిన తర్వాత వినూత్న ప్రక్రియ ద్వారా ఈ గోడలు తళ తళ లాడే విధంగా తీర్చి  దిద్దారు. దీనికోసం అతి తెల్లని పలుగురాళ్లను   మెత్తగా పొడి చెసి,అందులో తెల్లని మెత్తని ఇసుకను కలిపి దానిలో లక్షలాది కోడిగుడ్ల తెల్ల సొన సమపాళ్లలో కలిపి జిగురుగా తయారయ్యేవరకు గానుగలతో నూరించేవారు. పాలగచ్చు గా వ్యవహరించే ఈ పదార్థాన్ని గోడలకు మందంగా మెత్తించి, నునుపు వచ్చేదాకా గుండ్రాళ్లతో  రుద్దించేవారు.దానితో రాజభవనం మచ్చలేని అద్దాల వలె తళ తళ లాడుతుండేవి. ఈ మేడలో ప్రవేశించిన వారు తమ ప్రతిబింబాలను ఆ గోడల్లో చూసుకోగలిగేవారు.అందుకే ఈ భవనాన్ని అద్దాలమేడగా వ్యవహరించేవారు.

ఇవీ ఆనాటి కోట విశేషాలు!  వినుకొండ, బెల్లంకొండ,కొండవీడు దుర్గాల మధ్య గల 420 గ్రామాలకు అథిపతి గా రాజావారు నరసరావుపేటనుంచే పరిపాలన సాగించేవారు.

15 comments:

Vinay Chakravarthi.Gogineni said...

baagundi

Srujana Ramanujan said...

నాకు నరసరావుపేటతో అంత పరిచయం లేదు కానీ ఆ ఊరి కి ఒక్కసారి వెళ్ళాను మా నాన్నగారితో. ఒక్క రోజే ఉన్నా, అక్కడ నేను ఇష్టపడ్డవాటిలో గడియార స్థంభం ఒకటి.

అవకాశం ఉంటే, (మీరు ఇస్తే) నేను ఆ అనుభూతిని పంచుకోగలను.

సుజాత వేల్పూరి said...

Srujana, you are most welcome. Please send your opinion to Geetaacharya, so that he can publish it in the blog. thanks

చైతి said...

Have heard about you. Now read ur piece. chala bagundi. kota gurinchi

Anil Dasari said...

కోట విశేషాలు బాగున్నాయి.

>> "లక్షలాది కోడిగుడ్ల తెల్ల సొన సమపాళ్లలో కలిపి"

ఈ కోడిగుడ్ల ఫార్ములా ఇతర కోటల విషయంలోనూ విన్నాను. ఇనప పనిముట్లు లేని కాలంలోనే ఈజిప్టులో పిరమిడ్లకోసం లక్షలాది బండరాళ్లు అంత కచ్చితమైన కొలతలతో చెక్కారన్నప్పుడు వేసినంత ఆశ్చర్యం ఈ గుడ్ల విషయంలోనూ వేసేది. పౌల్ట్రీ పరిశ్రమ లేని ఆ రోజుల్లో అన్నన్ని లక్షల గుడ్లెలా దొరికేవో అంతుబట్టని విషయం! 'రాజుగారు కట్టిన కోటలు కాదోయ్, అందులో కలిపిన గుడ్లెవరివి?'

Malakpet Rowdy said...

Just passed through Narasaraopet once

Interesting story!

శ్రీరామ్ said...

Nice post ! I have nice attachment with NRT for more than 12 years.
Thanks alot for remebering those nice days !!

వేణూశ్రీకాంత్ said...

చాలా విశేషాలు తెలియచేశారండీ.. కోట బజారు, కోట గుమ్మం, చెరువు సత్యన్నారయణ టాకీస్ అన్నీ ఒక సారి తిప్పి చూపించారు. కోట తో పాటే కోట సెంటర్ లో బక్కెట్ల తో తెచ్చి వేసుకునే నాటు బాంబుల గురించి కూడా చెప్పాల్సింది. ఎన్నికల సమయం లో అటు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు పెద్దలు.

గీతాచార్య said...

@వేణూ శ్రీకాంత్,

కోటలో జరిగిన థ్రిల్లర్ నేను ఇస్తానుగా.

ప్రియ said...

కోట వెనక ఇంత కథుందా? అద్దాల మేడ గురించి ఆసక్తికరంగా చెప్పారు. మీ నుంచీ ఇంకా ఇలాంటి మంచి టపాలని ఆశిస్తున్నాను.

ramu said...

very nice, I have attachment with NRT for more than 15 years.
Thanks alot for remebering those nice days, My studies completed at Narasaraopet upto degree

Koti said...

Very good write-up. Really took me back 15-20 years.

Paddu said...

waiting for Ananjaneya swami kadhalu!!

ramana murthy said...

మీరు రాసిన వైనం చూస్తుంటే ........ఆ తరం ...ఈ తరం ....మధ్య నున్న మాకు ....రేపే చూడాలి అనిపించేటట్టుగా వుంది . ఇలాగె .....బ్లాగండి ! బ్లాగ్తే రహో !('blaagte raho ')

Tulasi said...

avuna.. ye kotakina kadha undadam sahajam... but meeru intha vivaram ga anni vishyalu cheppadam chala bagundhi. na engineering antha NRT lone.. but naku NRT gurinchi inni vishayalu mee blog vallane telisaayi..